సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన ఇది. హైదరాబాద్కు చెందిన ఓ యువతి స్నాప్డీల్లో రూ.228 విలువైన స్పైరల్ పొటాటో కటర్ కొన్న కొన్ని రోజులకు QP-SNDEAL పేరుతో ఓ ఎస్ఎంఎస్ వచ్చింది. "స్నాప్డీల్ కంపెనీలో ఆన్లైన్ షాపింగ్ చేసినందుకు మీరు రూ.6,90,000 విలువైన టాటా నెక్సాన్ కారు గెలుచుకున్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.6,500 చెల్లిస్తే చాలు. మరిన్ని వివరాల కోసం 18003133226 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి లేదా 06289633543 నెంబర్కు వాట్సప్ చేయండి" అన్నది ఆ మెసేజ్ సారాంశం. రూ.6,90,000 విలువైన కారు గెలుచుకున్నట్టు మెసేజ్ రాగానే ఆ యువతి సంబరపడిపోయింది. వెంటనే అందులో ఉన్న నెంబర్లకు కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను Snapdeal.com కంపెనీ ఉద్యోగి సత్య ప్రకాష్ అని చెప్పాడు.(నిజానికి స్నాప్ డీల్ కంపెనీ కి ఎటువంటి సంబంధం లేదు గమనించాలి.) రిజిస్ట్రేషన్ ఫీజు రూ.6,500 చెల్లించాలని కోరాడు. ఆమె డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. అంతటితో ఆగలేదు. వేర్వేరు కారణాలతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. ఆర్టీఓ ఛార్జీలు రూ.24,600, జీఎస్టీ రూ.18,500, ఇన్స్యూరెన్స్ ఛార్జీలు రూ.31,000, కార్ చెకింగ్ ఛార్జీలు రూ.74,400, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు రూ.50,000, డ్రైవర్ ఛార్జీలు రూ.25,000 ట్రాన్స్ఫర్ చేసింది ఆ యువతి. ఇలా మొత్తం రూ.2,30,000 వేర్వేరు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. రూ.6,90,000 విలువైన కారు వస్తుందని నమ్మి రూ.2,30,000 చెల్లించింది. చివరకు ఇదంతా మోసమని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది.
0 Comments